లడ్డూ వేలంపై బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ కీలక ప్రకటన

ప్రస్తుతం వాడవాడలో వినాయకులను పెడుతున్నారు.. గల్లీకో గణేష్‌ తరహాలు విగ్రహాలు ఏర్పాటు చేయడం.. లడ్డూ వేలం వేయడం జరుగుతోంది.. గణేష్‌ విగ్రహాన్ని పెట్టారంటే లడ్డూ వేలం అనేది సాధారణంగా మారిపోయింది.. కానీ, ఆ లడ్డూ వేలాన్ని ఆద్యుడు మాత్రం బాలాపూర్‌ గణేష్ అనే చెప్పాలి.. అయితే, కరోనా కారణంగా గత ఏడాది లడ్డూ వేలాన్ని రద్దు చేసింది బాలాపూర్‌ గణేష్ ఉత్సవ కమిటీ. ఈ తరుణంలో ఈ ఏడాది లడ్డూ వేలం ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు ఉండగా.. దానిపై క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన చేశారు బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌ రెడ్డి..

ఈ ఏడాది బాలాపూర్ గణేష్‌ లడ్డూ వేలం వేస్తామని వెల్లడించారు కళ్లెం నిరంజన్ రెడ్డి.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మండపానికి వచ్చే భక్తులు మాస్క్ ఉంటేనే అనుమతి ఇస్తామన్నారు.. ఈ ఏడాది 21 కిలోల లడ్డూ పెడుతున్నాం.. 15 అడుగుల ఎత్తున గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కోవిడ్‌ కారణంగా మండపంలోకి రావడానికి పోవడానికి ప్రత్యేక దారులు ఏర్పాటు చేశామని.. గత సంవత్సరం కోవిడ్ కారణంగా లడ్డూ వేలం పాట వేయలేదు.. కానీ, ఈ సంవత్సరం వేలం పాట నిర్వహిస్తామన్నారు.. మరోవైపు.. నాలుగు రోజుల కురుస్తున్న వర్షాలతో ఏర్పాట్లకు అంతరాయం కలిగినా.. చకచకా ఏర్పాటు జరగుతున్నాయన్నారు. కోల్‌కతా నుంచి వచ్చిన 56 మంది సిబ్బంది 7 రోజుల నుండి శ్రమిస్తున్నారని.. పనులు చివరి దశకు వచ్చాయని తెలిపారు. నవరాత్రుల్లో గణేశుని దర్శించడానికి రోజుకు 10 వేల మంది భక్తులు దర్శనానికి వస్తారని భావిస్తున్నామని.. ఈసారి తిరుమల తిరుపతి దేవస్థాననికి సంబంధించిన సెట్టింగ్‌ వేశామని.. వినాయకుని చెవులు, కళ్లు.. కదులుతూనట్టు(మూవీంగ్ ) చేయడం ఈసారి ప్రత్యేకతగా తెలిపారు కళ్లెం నిరంజన్‌ రెడ్డి.