ముంబై ఇండియన్స్‌పై బెంగుళూర్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ గెలుపు..

యావత్‌ క్రీడా ప్రపంచ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ సీజన్‌ రానే వచ్చింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో అనూహ్యంగా కోహ్లీసేన విజయం సాధించింది. ముంబయి నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఆఖరి బంతికి చేధించి మిగతా జట్లకు సవాలు విసిరింది.

టాస్‌ఓడి బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. హర్షల్‌ పటేల్‌ (5/27) చెలరేగడంతో రోహిత్‌ టీమ్‌కు అడ్డుకట్ట వేశాడు. క్రిస్‌లిన్‌ (49; 35 బంతుల్లో 4×4, 3×6), సూర్యకుమార్‌ యాదవ్‌(31; 23 బంతుల్లో 4×4, 1×6) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కీలకమైన 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(19; 15 బంతుల్లో 1×4, 1×6) అనవసర పరుగుకు యత్నించి ఆదిలోనే రనౌటయ్యాడు. ఆఖరి ఓవర్‌లో హర్షల్ పటేల్‌ నాలుగు వికెట్లు తీసి ఒకే పరుగు ఇవ్వడంతో ముంబయి ఇన్నింగ్స్‌కు తెరపడింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్‌ ఐదు.. సుందర్‌, జెమీసన్‌ చెరో వికెట్‌ తీశారు.

అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన బెంగుళూరు ఎక్కడ తడబడకుండా లక్ష్యం వైపు దూసుకెళ్లింది. డివిలియర్స్‌(48; 27 బంతుల్లో 4×4, 2×6), గ్లెన్‌ మాక్స్‌వెల్‌(39; 28 బంతుల్లో 3×4, 2×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. చివరి ఓవర్‌లో డివిలియర్స్‌ రనౌటవ్వడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కోహ్లీసేన విజయానికి చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరమైన నేపథ్యంలో హర్షల్‌ పటేల్‌(4) పని పూర్తి చేశాడు. దాంతో బెంగళూరుకు ఈ సీజన్‌లో తొలి విజయం దక్కినట్లయింది.