రెండో టీ20లో భారత్‌ ఘన విజయం..

India VS England 2nd T20: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పొందిన భారత్‌ రెండో మ్యాచ్‌లో దెబ్బకు దెబ్బ తీసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ బ్యాట్స్‌మెన్‌ రాణించడంతో టీమిండియా ఇంగ్లండ్‌ ఇచ్చిన 165 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఇషాన్‌ కిషన్‌ అద్భుతమైన హాఫ్‌ సెంచరీతో మొదటి నుంచి జట్టును స్కోరును పరుగులు పెట్టించాడు. ఇక తొలి మ్యాచ్‌ నిరాశపరిచిన విరాట్‌ కోహ్లి రెండో మ్యాచ్‌లో రాణించాడు. జట్టు స్కోరును పరిగెత్తించే క్రమంలో విరాట్‌ తన హాఫ్‌ సెంచరీని పూర్తి చేశాడు. తొలి టీ20లో ఓపెనర్స్‌ విఫలంకావడంతో టీమిండియా తీవ్ర ఒత్తిడికి గురైన విషయం తెలిసిందే. అయితే రెండో మ్యాచ్‌లోనూ రాహుల్‌ డకౌట్‌గా వెనుదిరగడంతో మళ్లీ అదే పరిస్థితి రిపీట్‌ అవుతుందా అని అందరూ భావించారు. కానీ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి నిలకడగా ఆడడం, దానికి అనుగుణంగా ఇషాన్‌ కిషన్‌ కూడా బౌండరీలు తరలించడంతో టీమిండియా ఒత్తిడిని అధిగమించగలిగింది. ఈ క్రమంలో జట్టును భారాన్ని తన భుజాలపై మోసిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కేవలం 49 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 73 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు.

ఇక అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌ ఆడిన ఇంగ్లండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 164/6 సాధించింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జోస్‌ బట్లర్‌(0), డేవిడ్‌ మలాన్‌(24), జేసన్‌ రాయ్‌(46), బెయిర్‌ స్టో (20), మోర్గాన్‌ (28), స్టోక్స్‌(24) పరుగులు సాధించి అవుటయ్యారు. ఇక టీమిండియా బౌలర్ల విషయానికొస్తే భువనేశ్వర్‌ కుమార్‌(1/28), చహల్‌(1/34) తలో వికెట్‌, సుందర్‌(2/29), శార్ధూల్‌ (2/29) చెరో రెండు వికెట్లు సాధించారు.