అచ్యుతాపురం సెజ్ ప్రమాదాలను అరికట్టలేరా?

విశాఖ నగరం సమీపంలో ఉన్న అచ్యుతాపురం ఎస్.ఇ.జెడ్. పారిశ్రామిక ప్రాంతంలో తరుచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో ఎల్.జి. పాలిమర్స్ ప్రమాదం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో, ఎంతమంది ప్రాణాలను హరించిందో, వందలాది మందిని శాశ్వత అనారోగ్యానికి గురి చేసిందో ఎప్పటికీ మరచిపోలేము. అచ్యుతాపురం సెజ్ లో మంగళవారం సాయంత్రం దుస్తులు తయారుచేసే సీడ్స్ అనే కంపెనీలో విషవాయువు లీకై 125 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవడం దురదృష్టకరం. ఈ ఘటనకు ప్రజా ప్రతినిధులు, అధికార గణం నిర్లిప్తతే కారణం. ఇదే కంపెనీలో నెల క్రితమే ఇటువంటి ప్రమాదం జరిగింది. అప్పుడు 400 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇది మళ్లీ పునరావృతం అయింది. అయితే ప్రమాదానికి కారణాలు ఏమిటో అటు అధికారులుగాని, ఇటు కంపెనీ ప్రతినిధులుగాని చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రధానంగా ఔషధ, రసాయన, ఉక్కు, జౌళి కర్మాగారాలలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పరవాడ, దువ్వాడ, అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతాల చుట్టుపక్కల కాలనీవాసులు, గ్రామస్తులు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో, ఏ విషవాయువు ప్రాణాలు తీస్తుందో అని బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రాష్ట్రం, దేశ ప్రగతికి పరిశ్రమలు ఎంతో అవసరం. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ ప్రగతి ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెట్టి కాదు. పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ప్రజాప్రతినిధులు, అధికారులు కలసికట్టుగా పనిచేయాలి. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ పకడ్బందీగా చేపట్టాలి. ఆరోగ్యకరమైన పారిశ్రామిక ప్రగతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతికి తావులేని విధంగా పని చేయాలి. ఎటువంటి వైఫల్యం ఎదురైనా అందుకు ప్రభుత్వంలోని పెద్దలే బాధ్యత వహించాలి. దుస్తుల కర్మాగారం వాయు ప్రమాదంలో అస్వస్తులైన మహిళా కార్మికులకు ప్రభుత్వం మేలైన వైద్యాన్ని, నష్ట పరిహారాన్ని అందించాలని పవన్ కళ్యాణ్ కోరారు.