జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణ రద్దు చేయండి

‌జాతీయ స్థాయి ఇంజినీరింగ్‌, మెడిక‌ల్ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌లు జేఈఈ ( JEE ), నీట్‌ ( NEET )లను కేంద్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA ) ప్ర‌క‌టించింది. ఈ మేరకు ఎన్టీఏ అడ్మిట్ కార్డులను సైతం వెబ్‌సైట్లో ఉంచామని, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా డౌన్‌లోడ్ చేసుకోవాలని శుక్రవారం సూచించింది. అయితే.. కరోనావైరస్ వ్యాప్తి కాలంలో పరీక్షలు నిర్వహించడంపై ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కేంద్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తంచేశారు. జేఈఈ, నీట్ ప్రవేశ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని ఆయన డిమాండ్ చేస్తూ ట్విట్ చేశారు.

‘‘జేఈఈ, నీట్ పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం విద్యార్థుల జీవితాలతో చెల‌గాటం ఆడుతోంది. వాటిని ర‌ద్దు చేసి ఈ ఏడాదికి ఆయా కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పించ‌డానికి ఇత‌ర మార్గాల‌ను అణ్వేషించాలని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. ఊహించని సంక్షోభం తలెత్తినప్పుడు ఇలాంటి నిర్ణయమే పరిష్కారానికి దారి చూపిస్తుంది.’’ అంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ నిశాంక్‌కు ట్వీట్‌ను జతచేశారు.