ఏపీలో 7వ తరగతికి సీబీఎస్ఈ సిలబస్.. ఈ ఏడాది నుంచే అమలు!

ఏపీ పాఠశాలల్లో సీబీఎస్ఈ పాఠ్యప్రణాళికతో విద్యాబోధన అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది నుంచే తొలి అడుగు వేయాలని సీఎం జగన్ సంకల్పించారు. మొదటగా 7వ తరగతిలో సీబీఎస్ఈ విద్యావిధానం అమలు చేయనున్నారు. ఆపై దశల వారీగా సెంట్రల్ సిలబస్ ను మిగతా తరగతులకు కూడా వర్తింపజేస్తారు.

ఈ మేరకు సీబీఎస్ఈ బోర్డుతో రాష్ట్ర విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏపీలో విద్యాప్రమాణాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా విద్యారంగంలో సంస్కరణలకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, 2024-25 విద్యాసంవత్సరం నాటికి పదో తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ విద్యాబోధన అమల్లోకి తీసుకురావాలన్నది ఏపీ ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది.