ముస్లింలకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. గంగాజమునా తహజీబ్ జీవన విధానం మరింతగా పరిఢవిల్లాలని, సోదరభావ స్ఫూర్తి గొప్పగా బలపడాలని సీఎం అభిలాషించారు. రంజాన్ పర్వదినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని, అన్నిమతాలకు సమాన గౌరవం ఇస్తూ మత సామరస్యం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నదని సీఎం తెలిపారు.

ఆర్థికంగా వెనకబడిన ముస్లిం సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని గుర్తు చేసుకున్నారు. షాదీముబారక్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు పేదింటి ముస్లిం ఆడపిల్లల జీవితాల్లో గుణాత్మక మార్పునకు దోహదపడుతుండడం గొప్ప విషయమన్నారు. ముస్లిం మైనారిటీ బిడ్డల చదువుల కోసం అమలు పరుస్తున్న వివిధ పథకాలు విజయవంతమయ్యాయని సీఎం తెలిపారు. ప్రత్యేక గురుకులాలు సత్ఫలితాలను అందిస్తుండడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ముస్లింలు ప్రార్థనలు చేసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు.