నేటి నుంచి సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన.. నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలకు శ్రీకారం

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. జిల్లాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాలతోపాటు పోలీసు కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలను కూడా ప్రారంభించనున్నారు. సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్‌అర్బన్‌ కలెక్టరేట్‌ భవనాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు సిద్దిపేటకు చేరుకొని జిల్లా కలెక్టరేట్‌తోపాటు పోలీసు కమిషనరేట్‌ను, ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయాన్ని సైతం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి సమీకృత కలెక్టరేట్‌తోపాటు ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆయా జిల్లాల్లోని గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించే అవకాశం ఉన్నది.

కామారెడ్డి జిల్లా పర్యటన..

కామారెడ్డి జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవనం, జిల్లా పోలీసు కార్యాలయాలను ఆదివారం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఇప్పటికే రెండుమార్లు రద్దయి ఎట్టకేలకు ఫిక్స్ అయ్యింది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేసింది.

సమీకృత జిల్లా కార్యాలయాల భవనం అంటే:

ప్రభుత్వ కార్యాలయానికి పనిమీద వచ్చిన ప్రజలు ఒక్కో విభాగం అధికారి కోసం జిల్లా కేంద్రంలోని అన్ని కార్యాలయాలకు రోజంతా తిరగాల్సిన అవసరం లేకుండా జిల్లాస్థాయి అధికారుల కార్యాలయాలన్నీంటిని ఒకేచోట ఉండేలా సమీకృత భవనాలను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. దీంతో రెండు మూడురోజుల్లో అయ్యేపనిని ఒక్కపూటలో కానున్నది. ప్రజలకు పను త్వరగా పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంది. సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవనాలతో మారుమూల నుంచి పనిపై కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చే వ్యక్తి ఒక్కపూటలో అన్నిశాఖల అధికారులను కలిసి పని పూర్తిచేసుకొని ఇంటికి చేరుకొనే అవకాశం ఏర్పడింది.

హరిత భవనాలుగా.. సమీకృత కలెక్టరేట్లు..

నూతన సమీకృత కలెక్టరేట్లను పర్యావరణ పరిరక్షణ ఉండేలా హరిత భవనాలుగా నిర్మించారు. 25 జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్‌ భవనాలు నిర్మిస్తుండగా, ఒక్కో భవనాన్ని దాదాపు రూ.50 కోట్లనుంచి రూ.60 కోట్లతో 1.50 లక్షల చదరపు అడుగులు ఉండేలా చూస్తున్నారు. వీటిలో 12 కలెక్టరేట్ల నిర్మాణం పూర్తయ్యాయి.

నిజామాబాద్‌, జగిత్యాల, జనగామ, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, వికారాబాద్‌, వనపర్తి, మమబూబ్‌నగర్‌, యాదాద్రి భవనగిరి కలెక్టరేట్‌ భవనాలు సైతం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి భవనం యు ఆకారంలో ఉంటుందని, మధ్యలో అతి పెద్ద ఓపెన్‌ఏరియా ఉంటుందని, దీంతో గాలి, వెలుతురు బాగా వస్తుందని ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు.