పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం..

పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. బలనిరూపణలో ముఖ్యమంత్రి వి నారాయణ స్వామి విఫలమయ్యారు. తగిన సంఖ్యాబలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సీఎం సభ నుంచి వెళ్లిపోయారు. విశ్వాస పరీక్షలో కాంగ్రెస్ పార్టీ విఫలం కావడంతో ముఖ్యమంత్రి నారాయణ స్వామి అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. రాజ్ నివాస్‌కు వెళ్లి తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసైకి సమర్పించారు. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంలో ప్రసంగించిన సీఎం నారాయణ స్వామి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజల కోసం రాత్రింబవళ్లూ పనిచేశామని ఆయన చెప్పారు. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా పనిచేసిన కిరణ్ బేడీ ప్రతిపక్షంతో కలిసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారని సీఎం ఆరోపించారు. తమ ఎమ్మెల్యేల మద్దతుతో ఐదేళ్ల పాటు తమ ప్రభుత్వం ప్రజలకు సేవ చేసిందని ఆయన చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రాన్ని నిధులడినప్పటికీ మంజూరు చేయలేదన్నారు.

ఇదిలా ఉంటే.. పుదుచ్చేరి శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల అనంతరం 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ముగ్గురు నామినేటెడ్ సభ్యులు. నారాయణ స్వామి ప్రభుత్వం గట్టెక్కడానికి అవసరమైన 14 మంది ఎమ్మెల్యేల మద్దతు కాంగ్రెస్‌కు కరువైంది. కాంగ్రెస్ కూటమి బలం 12కి తగ్గింది. విశ్వాస పరీక్షకు తగిన సంఖ్యా బలం లేకపోవడంతో కాంగ్రెస్, డీఎంకే పొత్తుతో ఉన్న అధికార పక్షం విశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగకుండానే కుప్పకూలింది.