కరోనా విజృంభణ.. ఒడిశాలో లాక్‌డౌన్‌..

ఒడిశాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 14 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించింది. మే 5వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రవాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. కూరగాయల కోసం ఇంటి నుంచి కేవలం 500 మీటర్లలోపే సంచరించాలని, ఆ దుకాణాలు కూడా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని స్పష్టం చేసింది. ఇతర నిత్యావసరాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు.

కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధించాయి. వారంపాటు లాక్‌డౌన్‌ విధించిన దిల్లీ.. మరో వారం పాటు లాక్‌డౌన్‌ను కొనసాగించనున్నట్లు వెల్లడించింది. కరోనా కట్టడికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు సైతం లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి.

దేశంలో ఆదివారం ఒక్కరోజే 3,92,488 మంది వైరస్‌ బారిన పడ్డారు. 3,689 మంది మృతిచెందారు. కాగా ఒడిశాలో ఆదివారం ఒక్కరోజే 8,015 మందికి వ్యాధి సోకింది. 14 మంది మృత్యువాత పడ్డారు. వైరస్‌ సోకి ఒడిశాలో ఇప్పటివరకు మొత్తంగా 2,068 మంది బలయ్యారు.