దిల్లీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.కర్ఫ్యూ యోచనలో కేజ్రీవాల్!

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. మరీ ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో కోవిడ్-19 కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ విధించే యోచనలో కేజ్రీవాల్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి 10 గం.ల నుంచి వేకువజామను 5 గం.ల వరకు కర్ఫ్యూ విధించాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే ఎమర్జెన్సీ సేవలు, ఎమర్జెన్సీ వాహనాలను మాత్రం కర్ఫ్యూ సమయంలోనూ అనుమతించే యోచనలో ఉన్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే దీనికి సంబంధించి దిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. రాత్రి పూట కర్ఫ్యూ విధించే విషయంలో కేజ్రీవాల్ నిర్ణయం తీసుకుని…తుది ఆమోదం కోసం గవర్నర్ లెఫ్టినెంట్ అనిల్ బైజల్‌కు పంపనున్నారు. రాత్రి పూట కర్ఫ్యూను ఏ సమయంలో విధించాలన్న అంశంపై చర్చ జరిగినట్లు సీనియర్ అధికారి తెలిపారు. రాత్రిపూట కర్ఫ్యూ అనివార్యమయ్యేపక్షంలో రాత్రి 10 గం.ల నుంచి వేకువజామున 5 గం.లకు విధించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.

దిల్లీలో కోవిడ్ పరిస్థితిపై శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్షించిన అర్వింద్ కేజ్రీవాల్…ప్రస్తుతానికి దేశ రాజధానిలో లాక్‌డౌన్ విధించే యోచన లేదని స్పష్టంచేశారు. ప్రస్తుతం దిల్లీలో నాలుగో వేవ్ నడుస్తున్నట్లు చెప్పారు. అనివార్యమని భావిస్తే రాష్ట్ర ప్రజలతో చర్చించిన తర్వాత తది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దిల్లీ ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన కోవిడ్ బులెటిన్ మేరకు…24 గం.ల వ్యవధిల 15 మంది కరోనా బారినపడి మృతి చెందగా 3,548 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,79,962కు చేరుకోగా…వీరిలో 6.54 లక్షల మంది రికవరీ అయ్యారు.