ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్…

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో.. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. అర్హులైన వారు తమ వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. వ్యాక్సిన్ విషయంలో భయాందోళనలు అక్కర్లేదని స్పష్టం చేశారు. దేశంలో కరోనా వ్యాక్సిన్లకు కొరత లేదని జవదేకర్ వివరించారు.

మరోపక్క, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశంలో 4.85 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇచ్చామని తెలిపారు. రెండో విడతలో 80 లక్షల మంది వ్యాక్సిన్ పొందారని వివరించారు. గత 24 గంటల్లో 32.54 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్టు జవదేకర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి మాసంలో సగటున రోజుకు 3.77 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇచ్చామని చెప్పారు.