హర్యానా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన దత్తాత్రేయ

తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ నిన్న హర్యానా గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవలి వరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న దత్తాత్రేయను కేంద్రం హర్యానాకు బదిలీ చేసింది. చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ ఝా ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.

పంజాబ్ గవర్నర్ వీపీ సింగ్ బద్నోర్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా, దత్తాత్రేయ భార్య వసంత, కుమార్తె విజయలక్ష్మి ఇతర కుటుంబ సభ్యులతోపాటు తెలంగాణ బీజేపీ నేతలు ఈటల రాజేందర్‌, జితేందర్‌రెడ్డి, వివేక్, రవీందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.