ఢిల్లీ అల్లర్ల కేసులో దర్యాప్తు ప్రారంభం..

ఢిల్లీలో మంగళవారం హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ అల్లర్లు, ఘర్షణల్లో 86 మంది పోలీసులు గాయపడినట్టు తేలింది. దాడులకు పాల్పడిన వారికి సంబంధించి 22 కేసులను పోలీసులు నమోదు చేశారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ప్రత్యేక విభాగం ఈ కేసులను దర్యాప్తు చేసే అవకాశం ఉంది. నగరంలో ముకర్బా చౌక్, ఘాజీపూర్. ఐ టీ ఓ, సీమాపురి. టిక్రి బోర్డర్, రెడ్ ఫోర్ట్ ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో పోలీసులు గాయపడినట్టు పేర్కొన్నారు. ఘాజీపూర్, సింఘు తదితర చోట్ల అన్నదాతలు బ్యారికేడ్లను విరగ గొట్టారు. కొన్నింటిని కింద కాలువలో పడేశారు. ఈ ఘటనల్లో 8 బస్సులు, 17 ప్రైవేటు వాహనాలు దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా ఎర్రకోట వద్ద జరిగిన ఘటనలను ఖాకీలు సీరియస్ గా పరిగణించారు. అక్కడ స్తంభాలపై రైతులు ఎగురవేసినవి ఖలిస్తానీ జెండాలా, కాదా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు.

నిన్న రిపబ్లిక్ దినోత్సవ కార్యక్రమాలు ముగియడానికి ముందే రైతులు ఒక్కసారిగా బోర్డర్స్ దాటి నగరంలోకి దూసుకువచ్చారు. దాంతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం మారిపోయింది.