విద్యా వ్యవస్థను నాశనం చేశారు… ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఫైర్..

ఏపీ ప్రభుత్వం తీరుపై మరోసారి హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయులతో చదువు చెప్పించడం తప్ప అన్ని పనులూ చేయిస్తున్నారని.. చివరకు మరుగుదొడ్లు సైతం కడిగిస్తున్నారని ఆక్షేపించింది. మద్యం దుకాణాల వద్ద కొనుగోలుదారులను వరుసలో నిలబెట్టే బాధ్యతను అప్పగించిన విషయాన్ని గుర్తు చేసింది. బడిలో మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా?.. మధ్యాహ్న భోజన పథకం సరిగ్గా అమలవుతోందా లేదా ? అన్నది పర్యవేక్షించి ఈ ఫోటోలను ప్రభుత్వ యాప్‌లో అప్‌లోడ్‌ చేసే పనిని ఉపాధ్యాయులే నిర్వహిస్తున్నారని తెలిపింది. చదువు చెప్పడం మినహా మిగిలిన పనులన్నీ ఉపాధ్యాయులే చేస్తున్నారని ప్రస్తావించింది. ఇది తీవ్రమైన వ్యవహారమని ఆక్షేపించిన హైకోర్టు.. ఉపాధ్యాయుల సేవలను చదువు చెప్పేందుకే ఉపయోగించేలా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాలంటూ.. అడ్వకేట్‌ జనరల్‌ S.శ్రీరామ్‌కు హితవు పలికింది. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో ఇతర నిర్మాణపై చేపట్టిన ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా ధర్మాసననం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో రోడ్లపై ఎన్ని వాహనాలు వెళ్తున్నాయో లెక్కించేందుకు ఉపాధ్యాయులను రహదారులపై నిలబెట్టేవారని.. వారిలో తన తండ్రి కూడా ఉన్నారని జస్టిస్ దేవానంద్ గుర్తు చేశారు.

హైకోర్టు ఆగ్రహం

పాఠశాలల ఆవరణలో ఉన్న గ్రామ సచివాలయాల తొలగింపునకు ఏం చర్యలు తీసుకున్నారో నిర్దిష్ట వివరాలు ఇవ్వకుండా.. అధికారుల మధ్య జరిగిన రాత పూర్వక సంప్రదింపుల ఫైల్స్‌ను కోర్టు ముందు ఉంచితే.. ఉపయోగమేంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. సంబంధం లేని కాగితాలు సమర్పించి కోర్టును భ్రమింప జేయాలన్నది అధికారుల ఉద్దేశంలా ఉందని ధర్మాసనం ఆక్షేపించింది. వేల పేజీల జిరాక్స్ కోసం ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆక్షేపించింది. రాష్ట్రంలో ఇంకా కొన్ని పాఠశాలల్లో.. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు కొనసాగుతున్నాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.