రక్త పరీక్షతో క్యాన్సర్ నిర్ధారణ.. భారతీయ కంపెనీ ఘనవిజయం

కేవలం రక్త పరీక్షతో క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించే ప్రక్రియను భారతీయ బయోటెక్నాలజీ కంపెనీ ఎపిజనరిస్ రూపొందించింది. ముంబాయికి చెందిన ఈ కంపెనీ సింగపూర్ లోని జార్ ల్యాబ్స్ తో కలిసి సంయుక్తంగా ఈ ప్రక్రియను అభివృద్ధి చేసింది. రెండు కంపెనీలు నానోటెక్ సైంటిస్టు వినయ్ కుమార్ త్రిపాఠి, ఆయన కుటుంబ సభ్యుల యాజమాన్యంలోనివే కావడం విశేషం. ఈ ప్రక్రియపై బెర్లిన్ నుంచి వెలువడే మెడికల్ జర్నల్ సానుకూల సమీక్ష ప్రచురించింది. ప్రక్రియ వందశాతం రుజువైందని పేర్కొన్నది. రెండు కంపెనీల నిర్వహణలో పాలుపంచుకుంటున్న త్రిపాఠీ ఇద్దరు కుమారులు ఆశిశ్, అనిశ్ మీడియాకు ఈ ప్రక్రియ గురించి వివరించారు. ఈ ప్రక్రియకు హెచ్చార్సీ అని పేరు పెట్టారు. వెయ్యిమందిపై జరిపిన పరీక్షల్లో 25 రకాల క్యాన్సర్లు గుర్తించడం జరిగిందని వారు వివరించారు. ముందుగా భారత్‌లో ఈ ప్రక్రియను ప్రారంభించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. సంవత్సరాంతంలో ఈ తరహా క్యాన్సర్ పరీక్షలను ప్రవేశపెడతామని వివరించారు. రక్తాన్ని సేకరించి మాలిక్యులర్ పరీక్షలు నిర్వహించడం ద్వారా క్యాన్సర్ ను పసిగట్టడం ఈ ప్రక్రియ ప్రత్యేకత.

లక్షణాలు బయటపడేందుకు చాలా ముందరే క్యాన్సర్ ఉనికి తెలుస్తుంది. ప్రస్తుతం ఫలితాలు రావడానికి 3-4 రోజులు పడుతున్నది. ఆటోమేషన్ తో ఈ సమయాన్ని 2 రోజులకు తగ్గించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత క్యాన్సర్ పరీక్షలు చాలా బాధాకరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కొత్త ప్రక్రియలో కేవలం 5 మిల్లీలీటర్ల రక్తం తీసుకుంటే చాలు. పరీక్ష అయిపోయినట్టేనని అనిశ్ త్రిపాఠీ అన్నారు. ఈ పరీక్షకు ధర ఎంత ఉండవచ్చని అడిగితే కనీస స్థాయిలోనే ధర నిర్ణయిస్తామని చెప్పారు.