మాజీ సైనికుడిపై హత్యా యత్నానికి తెగబడ్డా పట్టించుకోరా?

• భూ కబ్జాలపై ఫిర్యాదు చేశాడనే దారుణానికి ఒడిగట్టారు
• కేంద్రీయ సైనిక్ బోర్డు దృష్టికి తీసుకువెళ్తాం

ఒక సైనికుడిగా దేశ రక్షణ విధుల్లో భాగస్వామి అయిన శ్రీ మోపాడ ఆదినారాయణ- తన గ్రామంపై బాధ్యతతో వ్యవహరించి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి అనుకొంటే పాలక పక్షం వ్యక్తులు అతనిపై హత్యా యత్నానికి తెగబడటం దురదృష్టకరం. దేశాన్ని శత్రువుల నుంచి కాపాడిన వ్యక్తి స్థానిక గూండాల నుంచి ప్రాణ హానిని ఎదుర్కొంటున్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం రౌతులపాలెంకు చెందిన శ్రీ ఆదినారాయణపై స్థానిక వైసీపీ సర్పంచ్ సంబంధీకులు తీవ్రంగా దాడి చేస్తే పోలీసులు స్పందించలేదు. హత్యా యత్నానికి సంబంధించిన సెక్షన్లు కాకుండా సాధారణ దాడి అనే విధంగా కేసు నమోదు చేశారని సమాచారం వచ్చింది. వైసీపీ వ్యక్తులు ప్రభుత్వ భూములు, కాలువలను కబ్జా చేసి రెవెన్యూ రికార్డులు మారుస్తున్నారు అని జిల్లా అధికారులకు శ్రీ ఆదినారాయణ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అతనిపై దాడి చేశారు అంటే – భూకబ్జాదార్లు ఎంతకు తెగిస్తున్నారో అర్థం అవుతోంది. విశాఖ చుట్టుపక్కల ప్రభుత్వమే సహజ వనరులను ధ్వంసం చేసి విలాసవంతంగా నివాస గృహాలు నిర్మించుకొంటోంది. ప్రజా ప్రతినిధులు ఆస్తులు కొల్లగొడుతున్నారు. వారి బాటలోనే వాళ్ళ అనుచరులు కబ్జాలు చేస్తూ ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. యథా పాలకుడు తథా అనుచరుడు అన్న విధంగా వైసీపీ పాలన ఉంది.
మాజీ సైనికుడు శ్రీ ఆదినారాయణపై దాడి చేసినవారిని అరెస్టు చేయడంలో పోలీసు యంత్రాంగం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో ఉన్నతాధికారులు చెప్పాలి. ఒక మాజీ సైనిక ఉద్యోగికే రక్షణ కల్పించలేకపోతే ఎందుకు? గతేడాది తిరుపతిలో జనవాణి నిర్వహిస్తే శ్రీ ప్రసాద్ అనే సైనికుడు తన భూమిని వైసీపీ వాళ్ళు కబ్జా చేసి వేధిస్తున్నారు అని వాపోయారు. రాష్ట్రంలో సైనికులు, మాజీ సైనికులను ఈ ప్రభుత్వం ఏ విధంగా ఇక్కట్ల పాల్జేస్తుందో ఈ ఘటనలే తెలియచేస్తున్నాయి. విశాఖపట్నం జిల్లా రౌతులపాలెంలో మాజీ సైనికుడు శ్రీ ఆదినారాయణపై చోటు చేసుకున్న హత్యా యత్నం ఘటనను జనసేన పార్టీ కేంద్రీయ సైనిక్ బోర్డు దృష్టికి తీసుకువెళ్తుంది. అతని కుటుంబానికి పార్టీ ధైర్యాన్నిస్తూ అండగా నిలుస్తుంది.