ఈ సమయంలో మనమంతా ఏకమవ్వాలి.. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సమంత

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండడంతో లక్షల సంఖ్యలో జనాలు వైరస్ బారిన బడుతున్నారు. ఇక సమయానికి చికిత్స అందక ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఆక్సిజన్ లభించక జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఈ గడ్డు సమయం నుంచి గట్టెక్కించడానికి చాలా మంది దాతలు ముందుకు వస్తూ తమ వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు భారత్‌కు మద్ధతు నిలుస్తుండగా.. దేశంలోని కొందరు సెలబ్రిటీలు కూడా ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలోకి నటి అక్కినేని సమంత కూడా వచ్చి చేరారు. ఇప్పటికే ప్రత్యూష ఫౌండేషన్‌తో పలు మంచి పనులు చేస్తోన్నసామ్‌.. తాజాగా కరోనా బాధితులను సైతం ఆదుకునే పనిలో పడ్డారు. డొనేట్ కార్ట్‌తో జతకట్టిన ప్రత్యూష ఆర్గనైనేషన్ విరాళలు సేకరణకు పూనుకుంది. ఈ విషయమై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్‌చేసిన సామ్ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా… “ఈ కష్ట సమయంలో మనమంతా ఏకమవ్వాల్సిన అవసరం వచ్చింది. కరోనాతో పోరాడుతున్న వారికి ఆక్సిజన్ సిలిండర్లు, మెడికల్ సదుపాయాల కోసం విరాళాలు సేకరిస్తున్నాం. ఈ మంచి కార్యక్రమానికి సీపీ సజ్జనర్ గారు మద్ధతు తెలియజేయడం మాకు ఎంతో సంతోషానిస్తోంది. మీరు అందించే చిన్న విరాళమైనా అవసరంలో ఉన్న ఎంతో మందికి ఉపయోగపడుతుంది. మీకు తొచినంత విరాళం అందించండి” అంటూ.. రాసుకొచ్చారు సమంత. పూర్తి వివరాలకు తన బయోలో పేర్కొన్నారు సమంత.