గజపతినగరం జనసేన ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

గజపతినగరం, డా.బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో గజపతినగరం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మర్రాపు సురేష్ మాట్లాడుతూ
రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితవాడలలో మౌళిక వసతులు అయిన త్రాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ద్వారా అభివృద్ధి చేయాల్సి ఉండగా నవరత్నాల పేరుతో ప్రభుత్వం ఆ డబ్బుని మళ్లించడం చాలా దారుణమని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. దేశంలోని సంపద, విజ్ఞానం, సామాజిక న్యాయం, అందరికీ సమానంగా అందాలని అంబేడ్కర్ ప్రవచించిన ఆదేశిక సూత్రాలకు అనుగుణంగానే జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆయన ఆశయాలను జనసేన పార్టీ తరుపున ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు, గజపతినగరం నాయకులు బుర్రిల రాము, ఆదినారాయణ, కలిగి అప్పారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.