జమ్ముకాశ్మీర్లో ఎన్కౌంటర్…ఉగ్రవాది మృతి
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్లోని సోఫియాన్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాది మరణించినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. రైఫిల్తో పాటు కొన్ని మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఓ ఇంట్లో దాగి ఉన్న ఇద్దరు ఉగ్రవాదుల కోసం ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్ను చేపడుతున్నట్లు కాశ్మీర్ పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలిపారు. రావల్పొరా గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు శనివారం సాయంత్రం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్కు బలగాలు తెరలేపాయి. అయితే వారిని పట్టుకునేందుకు ఐదుగురు గ్రామస్థుల సాయం తీసుకున్నాయి. దీంతో వారు టార్గెట్ చేసిన ఇంట్లో స్థానికులు చిక్కుకుపోవడంతో ఆపరేషన్ నిలిపి వేసి, వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన తర్వాత…ఆపరేషన్ తిరిగి కొనసాగించాయి.