నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్… తొలుత బ్యాటింగ్!

మొతేరాలోని  నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న కీలకమైన నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఈ పిచ్ కూడా స్పిన్ కు అనుకూలిస్తుందన్న వార్తలు ముందుగానే వచ్చిన నేపథ్యంలో, తొలుత బ్యాటింగ్ అడ్వాంటేజ్ ని వినియోగించుకోవాలని ఇరు జట్లూ భావించగా, ఆ అవకాశం ఇంగ్లండ్ కు దక్కింది.

ఈ పిచ్ తొలుత బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని భావిస్తున్నామని, ఆపై స్పిన్ కు సహకరిస్తుందన్న అంచనాతోనే తొలుత బ్యాటింగ్ ను ఎంచుకున్నట్టు ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ తెలుపగా, ఇంచుమించు తనది కూడా అదే అభిప్రాయమని కోహ్లీ చెప్పాడు. ఈ మ్యాచ్ లో బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్ ను తుది జట్టుకు ఎంపిక చేసినట్టు తెలిపాడు. తమ స్పిన్నర్లు ఇంగ్లండ్ ను కట్టడి చేయగలరనే భావిస్తున్నట్టు వ్యాఖ్యానించాడు.