హైదరాబాద్​పై గెలిచినా… ప్లే ఆఫ్​ రేసు నుంచి ముంబయి ఔట్​

ఐపీఎల్​ 14 నుంచి ముంబయి ఇండియన్స్​ నిష్ర్కమించింది. సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ గెలిచినప్పటికీ.. ప్లే ఆఫ్స్​కు అర్హత సాధించలేక పోయింది.

హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయి 193 పరుగులకు పరిమితమైంది. హైదరాబాద్ బ్యాటర్లలో కెప్టెన్‌ మనీశ్ పాండే (69) చివరి వరకు పోరాడినా.. అతడికి మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లేకపోవడంతో సన్‌ రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. హైదరాబాద్‌ ఓపెనర్లు ఓపెనర్లు జేసన్‌ రాయ్ (34), అభిషేక్‌ శర్మ (33) శుభారంభం చేశారు. ప్రియమ్‌ గార్గ్ (29) ఫర్వాలేదనిపించాడు. అయితే, మిగతా బ్యాటర్లు రాణించలేకపోయారు. మహమ్మద్ నబి (3), అబ్దుల్ సమద్ (2), జేసన్‌ హోల్డర్‌ (1), రషీద్ ఖాన్‌ (9), వృద్ధిమాన్‌ సాహా (2) పూర్తిగా విఫలమయ్యారు. ముంబయి బౌలర్లలో జేమ్స్ నీషమ్‌, నాథన్ కౌల్టర్ నైల్, జస్ప్రీత్‌ బుమ్రా తలో రెండు, ట్రెంట్ బౌల్ట్‌, పియూష్‌ చావ్లా తలో వికెట్ తీశారు.

13 ఓవర్లు పూర్తయ్యే సరికి హైదరాబాద్ స్కోరు 138/4 గా ఉంది. ఓపెనర్లు జేసన్‌ రాయ్ (34), అభిషేక్‌ శర్మ (33) ఔటయ్యారు. మహమ్మద్ నబి (3), అబ్దుల్ సమద్ (2) విఫలమయ్యారు. కెప్టెన్‌ మనీశ్‌ పాండే (33), ప్రియమ్‌ గార్గ్‌ (24) క్రీజులో ఉన్నారు. ముంబయి బౌలర్లలో జేమ్స్ నీషమ్‌ రెండు, ట్రెంట్ బౌల్ట్, పియూష్‌ చావ్లా తలో వికెట్‌ తీశారు.