సైనికుల కోసం ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించాలి: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోడీ ప్రతీఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా సైనికుల మధ్య దీపావళి జరుపుకొనే సంప్రదాయాన్ని కొనసాగించనున్నారు. సరిహద్దుల వెంబడి పహరా కాస్తున్న సైనికులతో దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ శనివారం రాజస్థాన్‌లోని జైసల్మేర్ వెళతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే జైసల్మేర్‌కు బదులు ఆయన గుజరాత్‌లోని భుజ్‌కు వెళ్లే అవకాశాలున్నాయని కూడా చెప్తున్నారు. గత ఏడాది ప్రధాని జమ్మూ, కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా వెళ్లి నియంత్రణ రేఖ వెంబడి విధులు నిర్వహిస్తున్న జవాన్లతో దీపావళి వేడుకలు జరుపుకొన్నారు. మోదీ ప్రధాని అయినప్పటినుంచి ప్రతి ఏడాది ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

ప్రధాని పర్యటన క్రమంలో సరిహద్దుల్లో మన దేశాన్ని కాపాడుతున్న సైనికుల కోసం ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించాలంటూ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. ‘ ఈ దీపావళి నాడు మన దేశాన్ని మొక్కవోని ధైర్యంతో కాపాడుతున్న మన సైనికులకు సెల్యూట్‌గా మనమంతా ఒక దివ్వెను వెలిగిద్దాం. మన సైనికులు ప్రదర్శిస్తున్న అసమాన ధైర్య సాహసాలకు కృతజ్ఞత తెలియజేయడానికి మాటలు సరిపోవు. సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్ల కుటుంబాలకు కూడా మనం కృతజ్ఞులుగా ఉండాలి’ అని ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.