ప్రతి ఒక్కరూ చదవాలి

ఈ రోజు కవికోకిల శ్రీ గుర్రం జాషువా గారి జయంతి సందర్భాన తన తరఫున, జనసైనికుల తరఫున అంజలి ఘటిస్తున్నాని జన సేనాని చెప్పారు. శ్రీ గుర్రం జాషువా గారి జీవితాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. తెలుగు సాహితీ లోకంలో కవి కోకిలగా కీర్తిగాంచిన శ్రీ గుర్రం జాషువా గారి జీవితం గురించి విద్యార్థులు, యువత కచ్చితంగా చదవాలన్నారు. బాల్యం నుంచే ఎన్నో ఆటుపోట్లు చవిచూసిన జాషువా, కులమత సంకుచిత భావనలున్న వారి నుంచి అవమానాలు ఎదురైనా మొక్కవోని ఆత్మస్థైర్యంతో రచనా వ్యాసంగాన్ని కొనసాగించారని తెలిపారు.

అవమానించిన వర్గాల నుంచే నవయుగ కవిచక్రవర్తిగా ప్రశంసలందుకున్నారని గుర్తు చేశారు. సాంఘిక, సామాజిక చైతన్యం కోసం ఎంత తపనపడ్డారో ఆయన రచనల్లో కనిపిస్తుందని చెప్పిన పవన్.. జాషువా పుట్టినరోజు సందర్భంగా వారిని స్మరించుకోవడం, వారి రచనలను ఒకసారి గుర్తు చేసుకోవడం ప్రతి తెలుగు భాషాభిమానికీ సంతోషమే అని పవన్ అన్నారు.