ఈ నెల 8 న దేశ వ్యాప్త బంద్ కు రైతుల పిలుపు

వివాదాస్పద రైతు చట్టాలకు నిరసనగా ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్న రైతులు వచ్ఛేవారం దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. ఢిల్లీకి దారి తీసే అన్ని రోడ్లనూ ఈ నెల 8 న (మంగళవారం) మూసివేస్తామని వారు హెచ్ఛరించారు. ఇప్పటివరకు కేంద్రంతో రైతు సంఘాలు నిర్వహించిన చర్చల్లో.. ఈ చట్టాలను రద్దు చేస్తామని కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వలేదని వారంటున్నారు. ‘వచ్ఛే మంగళవారం దేశంలోని అన్ని హై వే టోల్ గేట్లనూ ఆక్రమిస్తాం..టోల్ ఫీజును ప్రభుత్వం వసూలు చేయకుండా అడ్డుకుంటాం..మా ఉద్యమంలో మరింతమంది రైతులు చేరుతారు’.. అని హరీందర్ సింగ్ లాఖోవాల్ అనే రైతు సంఘం నేత చెప్పారు. శనివారం మోదీ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తామన్నారు. అటు-.. ఢిల్లీలో ఇప్పటికే వేలాది అన్నదాతలు ఉండగా ఢిల్లీ శివారుతో బాటు నోయిడా, ఘజియాబాద్ వంటి చోట్ల కూడా వందలాది మంది మోహరించారు. తమ డిమాండు నెరవేరేంతవరకు వెనక్కి వెళ్ళేది లేదని వారు స్పష్టం చేశారు. వారి ఆందోళన నేపథ్యంలో అన్ని సరిహద్దులనూ పోలీసులు మూసివేశారు. మా డిమాండును పక్కనబెట్టిన కేంద్ర మంత్రులు కమిటీలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని, చట్టాలకు సవరణలు చేస్తామంటున్నారని… కానీ ఈ కమిటీల వల్ల ఒరిగేది శూన్యమని రైతు సంఘాలు అంటున్నాయి.