ఆన్‌లైన్ క్లాసులే అయితే ఫీజులు తగ్గించాల్సిందే: సుప్రీంకోర్టు

సాధారణ స్కూలు తరగతులతో పోలిస్తే ఆన్‌లైన్ క్లాస్‌ల నిర్వహణ తల్లిదండ్రులకు భారంగా మారిందని సుప్రీం కోర్టు పేర్కొంది. కరోనా కారణంగా గతేడాది నుంచి స్కూళ్లన్నీ ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్న తరుణంలో స్కూళ్లకు ఇంకా ఖర్చు తగ్గిందని సుప్రీం పేర్కొంది. కొవిడ్ కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు పడిన ఇబ్బందులను స్కూలు యాజమాన్యాలు అర్థం చేసుకోవాలని, ఆమేరకు వారికి ఉపశమనం కలిగించాలని ఆదేశించింది. విద్యార్థులకు అందించని వసతులకు కూడా ఫీజులు వసూలు చేయడం లాభార్జనే అవుతుందని, అది మానుకోవాలని హితవు పలికింది.

ఇక గతేడాది లాక్‌డౌన్ కారణంగా చాలా కాలం స్కూళ్లు తెరవలేదు. దీని కారణంగా పెట్రోల్‌/డీజిల్‌, కరెంటు, నిర్వహణ ఖర్చు, నీటి ఛార్జీలు, స్టేషనరీ ఛార్జీలు వంటివి మిగిలిపోయాయి. వీటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అయినా కూడా ఫీజులు విషయంలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు వెనక్కి తగ్గలేదు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. కేవలం ఆన్‌లైన్ క్లాసులే అయితే కచ్చితంగా ఫీజులు తగ్గించాల్సిందే అని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ క్లాస్‌ల కారణంగా స్కూలు నిర్వహణ ఖర్చులు తగ్గాయి కాబట్టి ఆ ప్రయోజనాన్ని తల్లిదండ్రులకు బదిలీ చేయాలని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది.