ఇరాక్‌లోని కొవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 44 మంది మృత్యువాత

ఇరాక్‌లోని ఓ కొవిడ్ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 44 మంది సజీవ దహనమయ్యారు. నసిరియా పట్టణంలోని అల్-హుస్సేన్ కొవిడ్ ఆసుపత్రిలో జరిగిందీ ఘటన. ఆసుపత్రి ప్రాంగణంలోని ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి వార్డులను చుట్టుముట్టేశాయి. సమాచారం అందుకున్న వెంటనే సహాయక, అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే, దట్టంగా కమ్ముకున్న పొగ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

కాగా, ఈ ఘటనలో మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోగా మరో 67 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులతోపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగతా వారిని మరో ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇక్కడ గత ఏప్రిల్‌లోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ కొవిడ్ ఆసుపత్రిలోని ఆక్సిజన్ ట్యాంక్ పేలి 82 మంది ప్రాణాలు కోల్పోయారు. 110 మందికిపైగా గాయపడ్డారు.

ఘటన జరిగిన వెంటనే సీనియర్ మంత్రులతో అత్యవసరంగా సమావేశమైన ప్రధాని ముస్తాఫా అల్-కదిమి నసిరియాలోని ఆరోగ్య, సివిల్ డిఫెన్స్ మేనేజర్లను సస్పెండ్ చేసి, అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆసుపత్రి మేనేజర్‌ను సస్పెండ్ చేసిన అధికారులు త్వరలోనే అరెస్ట్ చేయనున్నారు.