విశాల్ ‘ఎనిమీ’ నుంచి ఫస్టు సింగిల్ రిలీజ్!

యాక్షన్ హీరోగా తమిళ .. తెలుగు భాషల్లో విశాల్ కి మంచి క్రేజ్ ఉంది. తమిళంతో పాటు తెలుగులోను ఆయన సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఆయన తాజా చిత్రంగా ‘ఎనిమీ’ రూపొందింది. ఆనంద శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మినీ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు.

విశాల్ జోడీగా మృణాళిని రవి నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడి పాత్రలో ఆర్య కనిపించనున్నాడు. షూటింగు పార్టును పూర్తిచేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో  ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టు సింగిల్ ను వదిలారు. ‘పడదే పడదే పడదే’ అంటూ ఈ పాట సాగుతోంది.

తమన్ స్వరపరిచిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, పృథ్వీచంద్ర ఆలపించాడు. విశాల్ – మృణాళిని రవిపై ఈ పాటను చిత్రీకరించారు. కొంతకాలం పాటు హీరోయిన్ గా తన జోరు చూపించి నటనకు దూరమైన మమతా మోహన్ దాస్, ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించడం విశేషం.