ప్రభుత్వ నిర్లక్ష్యం.. అన్నమయ డాం దారుణం
- డ్యామ్ కొట్టుకుపోవడంపై నిపుణుల విశ్లేషణ
- కేంద్ర మంత్రి సైతం అదే ఉద్ఘాటన
- ఇరకాటంలో జగన్ ప్రభుత్వం
- అయినా అడ్డగోలు బుకాయింపు
బిందె నిండిపోతే … కుళాయి అయినా కట్టేయాలి, లేదా బిందెలోని నీళయినా ఖాళీ చేయాలి! లేకపొతే నీళ్లు పొర్లిపోతాయి. ఇది చిన్నపిల్లవాడికైనా తెలిసిన విషయం! వర్షాకాలం రాగానే… గుడిసెకి ఉన్న కంతలు చూసుకుని తాటాకులు కప్పి బాగు చేసుకోవాలి. లేకపోతే ఇల్లంతా నీరు కారుతుంది. ఇది అతి సామాన్యుడైనా తీసుకునే జాగ్రత్త! కానీ… ఇంత చిన్నపాటి సంగతులు కూడా పట్టనంత నిర్లక్ష్యం, స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా అయిన కడపలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడంలో సుస్పష్టంగా బయటపడుతోంది. ఈ విషయాన్ని పారమ్లెంటులో కేంద్ర మంత్రి ఎత్తి చూపినా, జలవనరుల నిపుణులు విశ్లేషించి చెబుతున్నా…
ప్రభుత్వం మాత్రం నిస్సిగ్గుగా బుకాయించడం అందరినీ విస్మయపరుస్తోంది. కేంద్ర మంత్రి మాటల్ని కూడా ప్రతిపక్షాల కుట్రగా అభివర్ణించడం, ఆయన చెప్పిన విషయాలలో కూడా అబద్దాలు ఉండవా అంటూ అడ్డగోలుగా వాదించడం పరిశీలకులను సైతం చకితుల్ని చేస్తోంది.
*ఇంకా మాయని గాయం…
నవబరులో కడప జిల్లా లోని అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన కారణంగా ఉన్నట్టుండి గ్రామాల్లోకి విరుచుకుపడిన వరద చేసిన గాయాలు ఇంకా మానలేదు. అనూహ్యంగా వచ్చిన వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిన వారి కుటుంబాలు ఇంకా కుదుటపడలేదు. ఆప్తులను, ఆస్తులను కోల్పోయిన వారి కళ్లలో కన్నీటి తడి ఇంకా ఆరలేదు. కానీ… ఆ ప్రమాదం కేవలం ప్రకృతి వైపరీత్యం వల్ల ఏర్పడినదేనంటూ జగన్ ప్రభుత్వం బుకాయిస్తూ చేతులు దులుపుకోవడం బాధితులను మరింతగా బాధిస్తోంది. అయితే… ఇది ప్రకృతి వల్ల ఏర్పడిన విపరీతం కాదని, తీవ్రమైన నిరక్ష్ ్లయం, ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం వల్ల మాత్రమే సంభవించిన మానవ తప్పిదమని జలవనరుల నిపుణులు తాజాగా విశ్లేషిస్తున్నారు. ఇదే సంగతిని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ స్వయంగా పారమ్లెంటులో ఉద్ఘాటించారు. “మన దేశంలో ఒక డ్యామ్ కొట్టుకుపోయిందంటే ప్రపంచ దేశాలు దాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుంటారు. ఇదెంత సిగ్గు చేటు?” అంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, ఈ విషయంలో మానవ తప్పిదాలు కనిపిస్తున్నాయని విస్పష్టంగా వెల్లడించారు.
*నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనాలు…
జల నిపుణుల విశ్లేషణలను పరిశీలిస్తే విస్మరించడానికి వీల్లేని అంశాలు బయటపడుతున్నాయి. అవేంటో చూద్దాం…
- అన్నమయ్య జలాశయానికి సామర్థ్యానికి మించిన వరద రాబోతోందని తెలిసినా ఇంజినీర్లు కానీ, అధికారులు కానీ అప్రమత్తం కాలేదు.
- జలాశయం నిండిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ దాని గేట్లను ఎత్తి వరద నీటిని బయటకు వదలలేదు. అలా వదిలి ఉంటే జలాశయం కొట్టుకుపోయే పరిస్థితి ఎదురు కాకపోను.
- జలాశయానికి ఎప్పటి నుంచో నిర్వహణ పనులు చేయలేదు. కారణం అందుకు తగిన నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడం.
- అన్నమయ్య డ్యామ్కి సంబంధించి 5వ గేటుకు మరమ్మతులు చేయించకపోవడం. ఈ గేటు తెరుచుకోవడం లేదని దానికి మరమ్మతులు చేయించడానికి దాదాపు 4 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు నివేదించినా ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా పెడచెవిని పెట్టడం
- జలాశయం సామర్థ్యానికి మించిన వరద రాబోతోందని దాని పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు ముందు జాగ్రత్త చర్యగా సమాచారం అందించకపోవడం.
- సాధారణంగా జలాశయం పొంగిపొర్లిపోయేంత వరద వస్తుంటే ప్రమాద సూచికంగా సైరన్ మోగించడం లాంటి కనీస చర్యలను సైతం తీసుకోకపోవడం.
ఇవన్నీ… ప్రభుత్వ పరమైన ఉదాసీనతకి, అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. అయితే… ఇన్ని అంశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. వీటన్నింటినీ తేలిగ్గా కొట్టిపారేస్తూ తప్పంతటినీ జగన్ ప్రభుత్వం భారీ వర్షాల పైన నెట్టివేయడం విశ్లేషకులనే కాదు, సామాన్యులను సైతం అయోమయంలో పడేస్తోంది.
*ఇవీ పూర్వాపరాలు… నవంబరు నెలలో కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ స్థాయిలో వర్షాలు పడిన సంగతి తెలిసిందే. ఈ వర్షాల వల్ల అక్కడి బాహుదా, పింఛ, మాండవ్య నదులు పొంగిపొర్లాయి. ఫలితంగా వాటికి దిగువన ఉన్న పింఛ డ్యామ్ దెబ్బతినడంతో పాటు, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. ఇది వాటి పరిధిలోని అనేక గ్రామాల్లో ఆస్తి, ప్రాణ నష్టాలకు దారితీసింది. ఈ వర్షాలు గత వందేళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరుగనంత స్థాయిలో ఉన్నాయనీ, అందువల్లనే అనూహ్యమైన వరద నీరు వెల్లువెత్తిందనీ, ఆ కారణంగానే అన్నమయ్య జలాశయం కొట్టుకుపోయిందని జగన్ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే ఇదే ప్రభుత్వం, అధికారులు, వైకాపా నేతల మాటల్లోని డొల్ల తనాన్ని పట్టిస్తోంది. ఎలాగంటే డ్యామ్లకు ఎగువ ప్రాంతాల్లో ఎంతెంత వర్షపాతం పడుతోందనే విషయాలు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు ఇంజినీర్లు, రెవెన్యూ అధికారులకు తెలుస్తూ ఉంటాయి. ఆ వర్షపాతాల లెక్కల ఆధారంగా ఎంత పరిమాణంలో నీరు నదుల్లో పారుతుందో, ఆ నీటి వల్ల ఏ ఏ డ్యామ్ల్లోకి ఎంత నీరు వచ్చి చేరుతుందో లెక్క కట్టడం, అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడం, అవసరమైతే ప్రజలను సైతం అప్రమత్తుల్ని చేయడం వాళ్ల విధినిర్వహణే కాదు, బాధ్యత కూడా. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించ లేదనేది పరిశీలకుల ప్రధాన ప్రశ్న. కాబట్టి ఇది కచ్చితంగా మానవ తప్పిదమేనని సుస్పష్టంగా అర్థం అవుతోంది.
పింఛ ప్రాజెక్టు సామర్ధ్యం 50 వేల క్యూసెక్కులైతే, వర్షాల వల్ల లక్షా 30 వేల క్యూసెక్కుల నీరు వచ్చిపడింది. దీని పట్ల కూడా సరైన చర్యలను సకాలంలో తీసుకోకపోవడం వల్ల డ్యామ్దె బ్బతింది. అక్కడి నుంచి వెల్లువెత్తిన నీరు అన్నమయ్య జలాశయం చేరడానికి ఆరు గంటల సమయం పడుతుంది. పింఛ ప్రాజెక్టు దెబ్బతిన్న సమాచారం తెలిసిన వెంటనే అయినా అన్నమయ్య ప్రాజెక్టు అధికారులు స్పందించి ఉంటే ప్రమాదం తప్పేదనేది ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా స్ఫురించే విషయం. అయితే ఆ దిశగా తీసుకున్న చర్యలు కానీ, ప్రజలను అప్రమత్తులను చేసే ప్రయత్నాలు కానీ జరగలేదనేది జల వనరుల నిపుణులు చేస్తున్న విశ్లేషణ. అన్నమయ్య జలాశయం సామర్థ్యం 2.20 లక్షల క్యూసెక్కులైతే, వచ్చి చేరిన నీరు 3.20 లక్షల క్యూసెక్కులనేది అధికారుల వాదన. అయితే సకాలంలో స్పందించి గేట్లు ఎత్తి వేసి ఉంటే డ్యామ్కి ప్రమాదం వాటిల్లేది కాదు. ఎందుకంటే ప్రమాదం జరిగే ముందు అన్నమయ్య జలాశయంలో ఉన్న నీరు 1.59 టీఎమ్సీలు. ఆ సమయంలో డ్యామ్కి సంబంధించి ఒక గేటు పనిచేయకపోయినా, మిగతా గేట్ల ద్వారా 1.8 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికివదలవచ్చనేది నిపుణుల మాట. కానీ అలా ఎందుకు చేయలేకపోయారనేది ఇంకో కీలకమైన ప్రశ్న. అంటే వచ్చి పడే వరద నీటిని అంచనా వేయడంలోను, ఎంత నీరుని వదిలితే డ్యామ్సు రక్షితంగా ఉంటుందనే అంచనాకు రావడంలోను ఇంజినీర, అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నమాట.
*ఆ ఆరోపణలు నిజమేనా?
ప్రమాదం జరిగిన పూర్వాపరాల గురించి అధికారులు, దెబ్బ తిన్న గ్రామాల ప్రజల నుంచి సేకరిస్తున్న సమాచారాన్ని క్రోడీకరిస్తే మరిన్ని దారుణమైన సంగతులు బయటపడుతున్నాయి. అన్నమయ్య ప్రాజెక్ట్ జలవనరుల శాఖ అధికారులకు, అక్కడి రెవెన్యూ అధికారులకు మధ్య సమన్వయ లోపం ప్రధానంగా కనిపిస్తోంది. ప్రవాహాల తీవ్రతపై రెవెన్యూ అధికారులకు ఎప్పటికప్పుడు వర్తమానం పంపామని, అయినా వారు గేట్లు ఎత్తేందుకు అనుమతి ఇవ్వలేదని చెబుతున్నారు. తమ అనుమతి లేనిదే జలాశయాలు ఖాళీ చేయవద్దని రెవెన్యూ అధికారులు మౌఖికంగా ఆదేశించారని జల వనరుల అధికారులు చెబుతూ, తాము పంపిన వర్తమానాలను సైతం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని దారుణమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవేంటంటే… ప్రాజెక్టు దిగువన ఉండే చెయ్యేరు దగ్గర ఇసుక క్వారీలు ఉన్నాయి. ఇక్కడ నిత్యం వందలాది లారీలు ఇసుకను నింపుకుని వెళుతూ ఉంటాయి. ఆ సమయంలో చెయ్యేరు ప్రాంతంలో దాదాపు వంద లారీలు ఉన్నాయని, జలాశయం గేట్లు తెరిస్తే ఆ లారీలు కొట్టుకుపోతాయి కాబట్టే సరైన సమయంలో అనుమతి ఇవ్వలేదనే విమర్శ వినిపిస్తోంది. ప్రాజెక్టు నిండిపోతోందనే విషయాన్ని ఆ చుట్టు పక్కల గ్రామాల వాళ్లు కూడా ఫోన్ల ద్వారా అధికారులకు చెప్పారని, అయినా కూడా వాళ్లు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయా గ్రామాల వారు బాహాటంగానే చెబుతున్నారు.
*ప్రభుత్వ వైఫల్యానికి సాక్ష్యాలు…
అన్నమయ్య, పింఛ డ్యాములు దెబ్బతినడం వెనుక ప్రభుత్వ వైఫల్యం కూడా సుస్ఫష్టమనే విశ్లేషణలు ఉన్నాయి. డ్యాములకు నిర్వహణ చర్యలు చేపట్టడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. అలాగే అన్నమయ్య ప్రాజెక్టులో ఒక గేటు పని చేయడం లేదనే ప్రతిపాదనలు అధికారుల నుంచి ప్రభుత్వానికి అందాయి. కానీ ఆ నిధులను కూడా విడుదల చేయలేదు. కారణం ఒక్కటే… అప్పుల ఊబిలో, తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఎలాంటి పనులకు నిధులు విడుదల చేయాల్సి వచ్చినా తీవ్రమైన తాత్సారం చేయడమే. ఇన్ని తప్పిదాలు, వైఫల్యాలు, నిర్లక్ష్యాలు, బాధ్యతా రాహిత్యాలు అడుగడుగునా కనిపిస్తున్నా, ఇవన్నీ జరిగిన ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని చెబుతున్నా…. నిరజ్జ ్లగా, నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి, మంత్రులు బుకాయిస్తూ ప్రకృతి పైకి నెపాన్ని నేట్టేయడమే ఇప్పుడు అందరినీ విస్మయపరుస్తున్న నిజం.ఈ విషయంలో ఎవరి పాత్ర ఎంతున్నా… అకస్మాత్తుగా విరుచుకుపడిన వరద వల్ల ఆస్తులు కోల్పోయిన గ్రామస్థులకు ఎవరు భరోసా ఇస్తారు? వరదల్లో కొట్టుకుపోయిన ఆప్తులను తలుచుకుంటూ తల్లడిల్లుతున్న కుటుంబీకులను ఎవరు ఓదారుస్తారు? ఇవి మాత్రం జవాబు లేని ప్రశ్నలే!