కొండపైన తండ్రి గోవిందా అంటే – కొండ కింద కొడుకు ఓం నమఃశివాయ అంటున్నారు

  • జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఎద్దేవా
  • మున్సిపల్ కాంప్లెక్స్ ను పరిశీలించిన జనసేన, టిడిపి నేతలు

తిరుపతి: కొండపైన తండ్రి గోవిందా అంటే.. కొండ కింద కొడుకు ఓం నమశ్శివాయ అని అంటున్నారని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఎద్దేవా చేశారు. కపిలతీర్థం వద్ద ఉన్న నగరపాలక సంస్థకు చెందిన కాంప్లెక్స్ ని వైసీపీ నాయకులకు అతి తక్కువ అద్దెకు కట్టబెట్టడంపై ఆయన మండిపడ్డారు. సుమారు ఈ కాంప్లెక్స్ కి ఆరు లక్షలు అద్దె వచ్చే అవకాశం ఉన్న కాంప్లెక్స్ ను కేవలం 1.5 లక్షలకే కేటాయించడమేంటని ప్రశ్నించారు. మరోవైపు తిరుమలలో భక్తులకు అందించే నీటి పైన కూడా దోపిడీ చేస్తున్నారన్నారు. అందులో భాగంగా పైన తండ్రి కింద కొడుకు అక్రమాలకు కొదవ లేకుండా పోయిందన్నారు. తిరుపతిలో రోడ్లు విస్తరణ అంటూ ఇష్టానుసారం ప్రజల ఆస్తులని ధ్వంసం చేస్తూ రోడ్లు విస్తరణ చేస్తూ పక్కనున్న ఆస్తులను ఆక్రమణలకు పాల్పడుతున్నారన్నారు. దీనిపై పోరాడతామని ఎవరిని వదిలేది లేదని హెచ్చరించారు. జనసేన-టిడిపి కలిసి తిరుపతి ప్రతి ప్రాంతంలోనూ తిరిగి ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటామని వైఎస్ఆర్సిపి అక్రమాలపై పోరాడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షులు రాజారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, టీడీపీ అబ్సర్వర్ సురేంద్ర కుమార్, జనసేన టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.