ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు..

వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏపీలో ఒంటిపూట బడుల షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరాలు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఉదయం 7.45 గంటల నుంచి 11.30 గంటల వరకు తరగతులు జరుగుతాయని వివరించారు. ఆపై మధ్యాహ్న భోజనం ఉంటుందని చెప్పారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ మేరకు ఒక్కపూట బడులు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.

ఓవైపు ఎండలు తీవ్రమవుతుండడం, మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు నిర్ణయించామని పేర్కొన్నారు. కాగా, ఒంటిపూట బడుల నేపథ్యంలో పాఠశాల నుంచి విద్యార్థులను క్షేమంగా ఇళ్లకు చేర్చడంపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. పాఠశాలల్లో కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా చూడాలని అధికారులకు మంత్రి ఆదిమూలపు ఆదేశాలు జారీ చేశారు.