రాజేంద్ర సింగ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

ఇండియన్ వాటర్ మాన్ గా కీర్తిగాంచిన పర్యావరణ ప్రేమికుడు, రామన్మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ రాణా గారికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ రాజేంద్ర సింగ్ గారు నా మనసుకు దగ్గరైన సమాజసేవకులు. మన దేశంలో నదులన్నీ నిష్కాలుష్యంగా పరవళ్లు తొక్కాలని ఆశపడే జలభాంధవుడు. తరుణ్ భరత్ సంఘ్ ను స్థాపించి దేశంలో నదీజలాల పరిరక్షణకు అవిరళ కృషి జరుపుతున్న కృషీవలుడు. జనసేన ప్రారంభించిన ‘మన నది – మన నుడి’ కార్యక్రమాన్నిశ్రీ రాజేంద్ర సింగ్ గారు ఎంతో స్వాగతించారు. గంగా నదిని కాలుష్యం బారినుంచి కాపాడడానికి ఆయన చేస్తున్న కృషి అజరామరం. ఎడారికి దగ్గరగా ఉండే రాజస్థాన్ లోని వెయ్యి గ్రామాలలో నీటి వనరుల పరిరక్షణకు ఆయన చేసిన కృషి ఆ గ్రామాలను కరువు బారినుంచి కాపాడింది. అటువంటి గొప్ప సేవకునికి ఆ భగవంతుడు ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయుష్షును ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.