దీపావళి శుభాకాంక్షలు

యజ్ఞయాగాదులు మొదలు ప్రతి శుభకార్యం దీపారాధనతోనే ఆరంభమవుతుంది. దీపానికి అంతటి ప్రాముఖ్యతను ఇస్తాం. తమసోమా జ్యోతిర్గమయ అంటూ.. అజ్ఞానం నుంచి సుజ్ఞానం వైపు అడుగులు వేసేలా చేసేదే ‘దీపం’. భారతీయ సంస్కృతిలో భాగమైన ఈ దీపం.. దీపావళిగా ఆనంద వినోదాలతో పాటు భక్తి పారవశ్యంతో ఓలలాడించడానికి మన ముందుకు వస్తున్న శుభతరుణంలో తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

నరకాసురుడనే రాక్షసుడు అంతమయ్యాడన్న సంతోషంతో దీపాలు వెలిగించుకుని పండుగ చేసుకోవడం యుగయుగాలుగా కొనసాగుతోంది. ఆనాడు నరకాసుడు ఒక్కడే..మరి ఈనాడు ఎందరో నరకాసురులు పలు రూపాల్లో చెలరేగిపోతున్నారు. ప్రజల మాన, ధన, ప్రాణాలను హరించి వేస్తున్నారు. నాటి నరకాసురుని కంటే భీకరంగా చెలరేగిపోతున్నారు. ఇటువంటి ఈనాటి నరకాసురులు ప్రజాపాలన నుంచి దూరమైన నాడు నిత్యం దీపావళే! దానికి మన ఓటే సరైన ఆయుధం. దీపావళి అనంతరం ఎందరో గాయాల బారినపడడం, ముఖ్యంగా కనులకు గాయాలవడం చూస్తుంటాం.. వింటుంటాం. అటువంటి ప్రమాదాల నివారణకు జాగురూకలై ఉండవలసిందిగా మనవి. పర్యావరణానికి హాని చేయని బాణాసంచా సామాగ్రిని వాడండి. దాని వల్ల పర్యావరణానికి ఎంతో మేలు చేసినవారమవుతాము. ఈ దీపావళి పర్వదినాన ఆ లక్ష్మీదేవి కటాక్షవీక్షణలు భారతీయులందరికీ ప్రసరిల్లాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ అన్నారు.