ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సాధించిన అఖండ విజయాన్ని అభినందిస్తూ నలుచెరగుల నుంచీ శుభాకాంక్షలు అందిస్తున్నారు. రైతాంగం, కార్మిక లోకం, పారిశ్రామికవేత్తలు, విద్యావంతులు, మేధావులు, మహిళలు, యువత, సామాజికవేత్తలు… ఇలా ప్రతీ వర్గం ఈ విజయంపట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ కథానాయకులు, నటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు హర్షాన్ని తెలియచేస్తూ శుభాకాంక్షలు అందించారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన శ్రేయోభిలాషులు తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సాధించిన విజయాన్ని స్వాగతిస్తూ శుభాకాంక్షలు వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విజయం మా అందరిపై బాధ్యతను మరింత పెంచింది. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ముందడుగు వేస్తామని జనసేనాని స్పష్టం చేశారు.