ఏపీలోని ఆ ఐదు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు: వాతావరణశాఖ

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ఉభయగోదావరి జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో నిన్న అల్పపీడనం ఏర్పడింది. వాయవ్య దిశగా ప్రయస్తున్న ఇది రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అలాగే, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో రేపటి వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కాగా, నిన్న శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. పలాసలో అత్యధికంగా 79.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.