వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై హైకోర్టు కీలక ఆదేశం
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలోనే చేస్తామన్న హామీని రాష్ట్ర ప్రభుత్వం పాటించనందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాఫ్ట్వేర్లో ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని సూచించింది. కులం, కుటుంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ ప్రకియలో ఇతర గుర్తింపు పత్రాలు అడగొచ్చని.. ఆధార్ వివరాలు మాత్రం సేకరించవద్దని స్పష్టం చేసింది. న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ప్రభుత్వం ఉల్లంఘించిందని.. తెలివిగా ప్రజల సున్నితమైన సమాచారం సేకరిస్తే అంగీకరించమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతపైనే తమ ఆందోళనని.. సాఫ్ట్వేర్లో మార్పులు చేసి సమర్పించాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది.