నాకు ముందే తెలుసు.. హైకోర్టులో అప్పీల్ కు వెళ్తా!: రఘురామరాజు

ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలకు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. వీరిద్దరి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో రఘురాజు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ కు వెళతానని ఆయన అన్నారు. వచ్చే వారంలో హైకోర్టులో అప్పీల్ చేస్తానని చెప్పారు.

సీబీఐ కోర్టు తీర్పు ఇలాగే వస్తుందని తాను ముందే ఊహించానని రఘురామకృష్ణరాజు అన్నారు. గత విచారణ సందర్భంగా జడ్జి తన అభిప్రాయాన్ని వెల్లడించకముందే… జగన్, విజయసాయిల బెయిల్ ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టేసిందంటూ సాక్షిలో బ్రేకింగ్ వచ్చిందని… ఆ రోజు సాక్షి ప్రకటించిన విధంగానే ఈరోజు కోర్టు తీర్పు వచ్చిందని వ్యాఖ్యానించారు.

తాను నెగ్గననే విషయం గత నెల 25వ తేదీనే తనకు అర్థమయిందని చెప్పారు. ఒకవేళ కోర్టులో తాను నెగ్గి ఉంటే… జగన్, విజయసాయిరెడ్డి హైకోర్టుకు వెళ్లేవారని… ఇప్పుడు తాను హైకోర్టుకు వెళ్తానని చెప్పారు. హైకోర్టులో కూడా వారికి అనుకూలంగానే తీర్పు వస్తే… తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని తెలిపారు.