ఐవోఆర్ దేశాలకు ఆయుధ వ్యవస్థ సరఫరాకు భారత్ సిద్ధం

హిందూ  మహాసముద్ర తీర దేశాల (ఐవోఆర్)కు రక్షణ వ్యవస్థలను సరఫరా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. బెంగళూరులో జరుగుతున్న ‘ఏరో ఇండియా 2021’ ప్రదర్శనకు హాజరైన మంత్రి ఐవోఆర్ రక్షణ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూ మహా సముద్ర తీరాల ఉమ్మడి అభివృద్ధి, నిర్మాణాత్మక భాగస్వామ్యానికే భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.

క్షిపణి వ్యవస్థలు సహా తేలికపాటి యుద్ద విమనాలు, హెలికాప్టర్లు, తేలికపాటి రవాణా విమానాలు, యుద్ధ-నిఘా ఓడలు, ఆర్టిలరీ గన్ వ్యవస్థలు, ట్యాంకులు, రాడార్లు, మిలటరీ వాహనాలు సహా మరెన్నింటినో ఐవోఆర్ దేశాలకు సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఐవోఆర్ దేశాల భాగస్వామ్యంతో హిందూ మహాసముద్ర వనరులను, అవకాశాలను సమన్వయం చేసేందుకు భారత్ కృషి చేస్తున్నట్టు రక్షణ మంత్రి వివరించారు.