అమెరికా నుంచి అందిన తొలి ‘కోవిడ్ సాయం’… అండగా నిలుస్తామని హామీ!

అమెరికా నుంచి అత్యవసర కొవిడ్ ఉపకరణాల విమానం ఈ ఉదయం భారత్ కు చేరింది. కరోనా రెండో వేవ్ ఇండియాను తీవ్ర ఇబ్బందులు పెడుతూ, ఆరోగ్య వ్యవస్థపై ప్రభావం చూపుతూ, రోజుకు దాదాపు 4 లక్షలకు కేసులు పెరుగుతున్న వేళ, అమెరికా నుంచి తొలి షిప్ మెంట్ అందింది. ఇందులో భాగంగా 400 ఆక్సిజన్ సిలిండర్లు, 10 లక్షల ర్యాపిడ్ కరోనా వైరస్ టెస్ట్ కిట్లు, ఇతర ఆసుపత్రి ఉపకరణాలను మోసుకుని వచ్చిన సూపర్ గెలాక్సీ మిలిటరీ ట్రాన్స్ పోర్టర్స్ విమానం, ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఉదయం ల్యాండ్ అయింది.

ఇందుకు సంబంధించిన చిత్రాలను భారత్ లోని యూఎస్ ఎంబసీ, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తాము పంపనున్న ఎన్నో విమానాల్లో ఇది మొదటిదని, ఇరు దేశాల మధ్యా ఉన్న 70 సంవత్సరాల అనుబంధం మరింత బలోపేతమైందని వ్యాఖ్యానించింది. కొవిడ్-19పై ఇండియా చేస్తున్న పోరాటానికి అమెరికా తనవంతు సహకారాన్ని అందిస్తుందని, మరిన్ని ప్రత్యేక విమానాల్లో కరోనాను నియంత్రించే షిప్ మెంట్స్ రానున్నాయని వెల్లడించింది.

ఈ వారం మొదట్లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ భారత్‌కు అత్యవసర సహాయం విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ”అమెరికాలో కొవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో భారత్‌ మా పక్షాన నిలబడింది. ఇప్పుడు భారత్‌కు అవసరం వచ్చింది. మేము భారత్‌ పక్షాల నిలబడాలనే దృఢసంకల్పం తీసుకొన్నాం” అని ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు భారత్‌లో టీకాల తయారీకి అవసరమైన ముడి పదార్థాల సరఫరాకు కూడా అమెరికా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.