హుజూరాబాద్‌లో ఇందిరా శోభన్ పాదయాత్ర..

వైఎస్ షర్మిల సొంత పార్టీ వైఎస్ఆర్ టీపీకి ఇటీవల రాజీనామా చేసిన మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. హైదరాబాద్ గన్ పార్కులో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన ఆమె.. ఈ నెల 27 నుంచి హుజురాబాద్‌లో పాదయాత్ర చేయనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ తన మాతృ పార్టీ అని.. హుజురాబాద్‌లో పాదయాత్ర తర్వాత తన రాజకీయ భవిష్యత్‌పై ప్రకటిస్తానని వెల్లడించారు.

కాగా గతంలో టీపీసీసీ చీఫ్‌గా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కారణంగానే తాను గతంలో కాంగ్రెస్ వీడానని ఇందిరా శోభన్ ఆరోపించారు. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ చేసిందేమీ లేదని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే తన లక్ష్యమని ఇందిరా శోభన్ స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల కోసం హుజూరాబాద్‌లో ఉప ఎన్నికను తీసుకువచ్చారని ఆరోపించారు. హుజూరాబాద్ తమకు లైట్ అంటున్న కేటీఆర్.. తన బావ హరీష్ రావును నెల క్రితమే ఇన్‌ఛార్జిగా ఎందుకు పెట్టారని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని పథకాలను హుజురాబాద్ నుంచే ఎందుకు అమలు చేస్తోందని ఇందిరా శోభన్ నిలదీశారు.