సమస్యను ఇజ్రాయెల్, పాలస్తీనాలే పరిష్కరించుకోవాలి: జో బైడెన్

బాంబులతో దద్దరిల్లుతున్న గాజాను పునర్నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అయితే, ఇప్పుడున్న సమస్యలను ఇజ్రాయెల్, పాలస్తీనాలే పరిష్కరించుకోవాలని, అదే సమస్యకు సరైన సమాధానమని తేల్చి చెప్పారు. మత కలహాలను ఆపేయాల్సిందిగా ఇజ్రాయెల్ ప్రజలకు సూచించారు. అయితే, ఇజ్రాయెల్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదని, తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

రెండు దేశాలూ జెరూసలేం తమదంటే తమదని యుద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితం ఇజ్రాయెల్ పై పాలస్తీనా గాజాలోని హమాస్ తీవ్రవాద సంస్థ రాకెట్ దాడి చేసింది. వందలాది రాకెట్లను ప్రయోగించింది. ఇజ్రాయెల్ తన క్షిపణి విధ్వంసక వ్యవస్థతో వాటిలో చాలా వాటిని నాశనం చేసింది. ఆ తర్వాత గాజా లక్ష్యంగా ఇజ్రాయెల్ కూడా మిసైళ్ల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలోనే రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.