దూసుకెళ్లిన ఇస్రో ‘సౌండింగ్ రాకెట్’!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. పీఎస్ఎల్వీసీ51 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన కొన్ని రోజులకే ఇంకో ప్రయోగాన్ని నిర్వహించింది. అయితే, ఆ ప్రయోగానికి ఇది పూర్తి భిన్నమైన ప్రయోగం. ఇక్కడా ప్రయోగించింది రాకెట్ నే అయినా.. ఉపగ్రహాలను మోసుకెళ్లే రాకెట్ మాత్రం కాదు.
ఈ సారి ఇస్రో ప్రయోగించింది ‘సౌండింగ్ రాకెట్’! శుక్రవారం సాయంత్రం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆర్ హెచ్ 560 అనే సౌండింగ్ రాకెట్ ను ప్రయోగించింది. వివిధ ఎత్తుల్లోని తటస్థ గాలుల్లో తేడాలు, ప్లాస్మా గతిశాస్త్ర వివరాలను తెలుసుకునేందుకు ఈ ప్రయోగాన్ని చేసినట్టు ఇస్రో ప్రకటించింది.
సౌండింగ్ రాకెట్లను అంతరిక్ష పరిశోధనల కోసం పర్యావరణంలోని వాతావరణ వివరాలను తెలుసుకునేందుకు ప్రయోగిస్తుంటారు. ఒకటి లేదా రెండు దశల ఘన ఇంధన రాకెట్లివి. వాహక నౌకలు, ఉపగ్రహాల్లో వాడే ఉప వ్యవస్థలు లేదా కొత్త పరికరాల ప్రొటోటైప్ ల పనితీరును తెలుసుకోవడం కోసం టెస్ట్ చేసేందుకు ఈ సౌండింగ్ రాకెట్లను వినియోగిస్తుంటారు. పైగా వీటికయ్యే ఖర్చు కూడా తక్కువే.
ప్రస్తుతం ఇస్రో వద్ద మూడు రకాల సౌండింగ్ రాకెట్లున్నాయి. ఆర్ హెచ్ 200, ఆర్ హెచ్ 300 మార్క్2, ఆర్ హెచ్ 560 మార్క్ 2 రాకెట్లు.. 80 నుంచి 100 కిలోల వరకు పేలోడ్ లను మోసుకెళ్లగలవు. 80 కిలోమీటర్ల నుంచి 475 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణించగలవు. 1965లో తొలిసారిగా ఇస్రో సౌండింగ్ రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించింది. వాటిని దేశీయంగానే తయారు చేస్తోంది.
Launch of sounding rocket (RH-560) to study attitudinal variations in the neutral winds and plasma dynamics carried out today at SDSC SHAR, Sriharikota#RohiniSoundingRockets #ISRO pic.twitter.com/B0ov8w5ARH
— ISRO (@isro) March 12, 2021