కుటుంబ సభ్యులను కించపరచడం తగదు

ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంటున్న రాజకీయ వైపరీత్యాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒకపక్క వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే ప్రజాప్రతినిధులు ఇవేమి పట్టనట్టు ఆమోదయోగ్యంకాని విమర్శలు, వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే విధంగా మాట్లాడారని గౌరవ ప్రతిపక్ష నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టడం బాధాకరం. ఇలాంటి ఘటనలు సామాన్యులకు రాజకీయ వ్యవస్థపై ఏహ్యభావం కలిగించే ప్రమాదం ఉంది. ఈ మధ్యకాలంలో సభలు, సమావేశాలు, చివరికి టి.వి. చర్చలలో కొన్నిసార్లు వాడుతున్న పదజాలం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంటోంది. గౌరవనీయ ప్రతిపక్ష నేత కుటుంబసభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత శోచనీయం. ఈ వ్యాఖ్యలు నిర్హేతుకంగా ఖండించదగినవి. ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి కుటుంబ సభ్యులను తక్కువచేసి కొందరు మాట్లాడినప్పుడు ఆనాడు కూడా ఆ వ్యాఖ్యలను ఇదే రీతిలో ఖండించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా ఆడపడుచుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు మరింత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మహిళలను కించపరచడం, వారి గౌరవ ప్రతిష్ఠలకు హాని కలిగించడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇటువంటి దిగజారుడు రాజకీయాలను ప్రతి ఒక్కరు ఖండించవలసిన అవసరం ఉంది. లేని పక్షంలో ఇది ఒక అంటు వ్యాధిలా అంతటా ప్రబలే ప్రమాదం ఉంది. రాజకీయ వ్యవస్థను ప్రజల దృష్టిలో పలుచన చేయవద్దని ఈ సందర్భంగా కోరుతున్నానని జనసేనాని అన్నారు.