వాలంటీర్లకు షాకిచ్చిన జగన్ సర్కార్
గ్రామ, వార్డు వలంటీర్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 35 ఏళ్లు నిండిన వాలంటీర్లను ఇంటికి పంపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి గ్రామ వాలంటీర్ సచివాలయం, వార్డు వాలంటీర్ సచివాలయం శాఖ డైరెక్టర్, కమిషనర్ జీఎస్. నవీన్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 35 ఏళ్లు దాటిన వాలంటీర్లు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇలా ముణ్ణాల ముచ్చటగా మిగిలిపోతున్నాయని తెలిసి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
18 ఏళ్ల లోపు.. 35 ఏళ్లు దాటిన వారిని విధుల నుంచి తప్పించాలని సూచించింది. ప్రభుత్వ ఆదేశంతో ప్రతి జిల్లాలోనూ వేల సంఖ్యలో గ్రామ, వార్డు వలంటీర్లు విధులకు దూరమవుతారంటూ ప్రచారం జరుగుతుంది. కానీ కేవలం పది మంది మాత్రమే నిబంధనలకు విరుద్దంగా రిక్రూట్మెంట్ జరిగిందంటున్నారు అధికారులు.
తొలగించబోయే వలంటీర్లకు జీతాలు చెల్లిస్తామంటోన్న అధికారులు చెపుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా కొందరు వలంటీర్ల నియామకం జరిగిందని ఈమేరకు ఫిర్యాదులు వచ్చాయని సర్కులర్లో ప్రభుత్వం పేర్కొంది. సీఎఫ్ఎంఎస్ ద్వారా జీతాల చెల్లింపులు కావడంతో వెలుగులోకి వచ్చాయి విషయాలు. ఖాళీల భర్తీకి తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.