తమిళనాడులో జల్లికట్టు పోటీలు షురూ

జల్లికట్టు… ఈ పేరు వింటేనే తమిళుల్లో ఉత్సాహం ఉప్పొంగుతుంది. పొంగల్ పండుగ సీజన్ లో నిర్వహించే ఈ పురాతన క్రీడలో పాల్గొనడాన్ని గ్రామీణ తమిళులు అమితంగా ఇష్టపడతారు. ఓసారి జల్లికట్టుపై నిషేధం విధించిన సమయంలోనూ వారు సంఘటితంగా పోరాడి తమ ప్రాచీన సంప్రదాయన్ని తిరిగి దక్కించుకున్నారు. తాజాగా, పొంగల్ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు సందడి కనిపిస్తోంది. మధురై జిల్లాలోని అవనియపురంలో ఇవాళ ఉదయం జల్లికట్టు పోటీలు షురూ అయ్యాయి. ఎంతో బలిష్టమైన ఎద్దులను అదుపు చేసేందుకు ప్రజలు పోటీపడ్డారు.

కాగా, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టుపై పలు ఆంక్షలు విధించింది. ఇందులో పాల్గొనేవారు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ అయ్యుండాలని, ఆ విషయం నిరూపిస్తూ సర్టిఫికెట్ సమర్పించాలని పేర్కొంది. జల్లికట్టులో పాల్గొనే పోటీదారుల సంఖ్యను 150కి పరిమితం చేసింది. పైగా, ప్రేక్షకులు కూడా  50 శాతం మించకూడదని స్పష్టం చేసింది.