జగిత్యాల అసెంబ్లీ బరిలో జనసేన పోటీకి సిద్ధం: జనార్దన్

తెలంగాణ, జగిత్యాల, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ స్థానంలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని జనసేన పార్టీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ బెక్కం జనార్దన్ అన్నారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 32 అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీచేస్తున్నట్లు జనసేన పార్టీ అద్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించడం తెలిసిందేనన్నారు. ఈ 32 స్థానాల్లో జగిత్యాల ఉందని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ రూపంలో జగిత్యాలలో స్థిరమైన ఓటుబ్యాంక్ ఉందని అందుకే ఇక్కడ పోటీ చేస్తామని తమ సత్తా చూపుతామని జనార్దన్ పేర్కొన్నారు. వారాహిలో పవన్ కళ్యాణ్ జగిత్యాల నియోజకవర్గంలో పర్యటిస్తాడని చెప్పారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉన్నామని ఈ సారి ఎన్నికల్లో జగిత్యాల ఓటర్లు జనసేన అభ్యర్థిని ఆశీర్వదించి గెలిపిస్తారనే ఆశాభావాన్ని బెక్కం జనార్దన్ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జగితాల పట్టణ అధ్యక్షులు చింత సుధీర్, జగిత్యాల రూరల్ మండలం అధ్యక్షులు బొల్లి రాము, లక్ష్మణ్, తాటిపల్లి అజయ్, మండల అధ్యక్షులు కాసవేణి మల్లికార్జున్, మండల ప్రధాన కార్యదర్శి బత్తిని బాబుగౌడ్, శివకుమార్, సారంగాపూర్ మండల అధ్యక్షులు తోకల శ్రీధర్, పర్వేజ్, కిరణ్ సింగ్, గట్ల శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.