జాబ్‌ క్యాలెండర్‌పై జనసేన పోరాటం: పవన్‌ కల్యాణ్‌

అమరావతి: జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు తమ పార్టీ బాసటగా నిలిచి పోరాటం చేస్తుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఈనెల 20న అన్ని జిల్లాల్లోని ఉపాధి కల్పన అధికారులకు వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను జాబ్‌ క్యాలెండర్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో వైకాపా చెప్పిన మాటలు నమ్మిన నిరుద్యోగ యువత జాబ్‌ క్యాలెండర్‌లో చూపించిన ఖాళీలతో నిరాశ చెందిందన్నారు. గత రెండేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం, అందుకు సంబంధించిన పోటీ పరీక్షల కోసం యువత ఎన్నో కష్టాలు ఓర్చుకొని సిద్ధమవుతున్నారని తెలిపారు.

రాష్ట్రంలో సుమారు 30లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఏపీపీఎస్సీ ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చివరకు జాబ్‌ క్యాలెండర్‌లో 10వేల ఉద్యోగాలను మాత్రమే చూపడం కచ్చితంగా యువతను వంచించడమే అవుతుందన్నారు. ఏవిధంగా మోసపోయామో నిరుద్యోగ యువతీయువకులు ఎంతో ఆవేదన చెందుతూ వారి పరిస్థితిని తనకు వివరించారన్నారు. గ్రూప్‌-1, 2 విభాగాల్లో కేవలం 36 ఖాళీలను మాత్రమే చూపించడం అంటే నిరుద్యోగులను మోసం చేయడమేనని అర్థమవుతుందన్నారు. కొద్ది నెలల కింద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగాల భర్తీపై సమీక్షిస్తే గ్రూప్‌-1, 2ల్లో సుమారు 1000 ఖాళీలను గుర్తించారన్నారు. జాబ్‌ క్యాలెండర్‌లో 36 మాత్రమే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.

ఉద్యోగాలకు సుమారు 20 లక్షల మంది వరకూ పోటీ పడతారని, పోటీ పరీక్ష ఫీజుల రూపంలోనే ప్రభుత్వానికి రూ.కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ఈ విధంగా నిరుద్యోగుల ఆశలను ప్రభుత్వం సొమ్ము చేసుకొంటుందని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ పోస్టులు వేల కొద్దీ ఖాళీలు ఉన్నాయని, ముఖ్యమంత్రి చెప్పిన మెగా డీఎస్సీ ఏమైపోయిందని నిలదీశారు. పోలీసు శాఖలో ఏడు వేలకుపైగా ఖాళీలు ఉన్నాయన్నారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నిరుద్యోగ యువతకు భరోసా కలిగించలేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి లభించని పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చే వాతావరణం లేదని, ఇప్పటికే ఉన్న పరిశ్రమల విస్తరణ కూడా సాగటం లేదని పవన్‌ దుయ్యబట్టారు.