పోసాని పెయిడ్ ఆర్టిస్టుగా మారిపోయాడు: అచ్చెన్నాయుడు

పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన నటుడు పోసానిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సీఎం జగన్, ప్రశాంత్ కిషోర్ కలిసి ఒక వికృత క్రీడ ప్రారంభించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆటలో పోసాని కృష్ణమురళి ఒక పెయిడ్ అర్టిస్ట్‌గా మారాడని అన్నారు.

వైసీపీ నేతలు ప్రజలు వినలేని భాషలో మాట్లాడుతుంటే జగన్ చాలా సంతోషిస్తున్నారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పోసాని వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అచ్చెన్న ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.

“పవన్ కల్యాణ్ విషయంలో పోసాని మాట్లాడిన బూతులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఇలాంటి భాషను ప్రయోగించి సంస్కృతీ సంప్రదాయాలను మంటగల్పుతున్నారు. పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యుల గురించి పోసాని చేత ప్రశాంత్ కిషోర్ టీం మాట్లాడిస్తుంటే జగన్ రెడ్డి ఎందుకు ఆపడం లేదు? సామాన్య ప్రజలు కనీసం వినలేని.. మాట్లాడలేని భాషలో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. వాళ్లు అలా మాట్లాడుతుంటే తాడేపల్లిలో జగన్ రెడ్డి ఆనంద పడిపోతున్నారు. మద్యం షాపుల దగ్గర చీప్ లిక్కర్ తాగిన తాగుబోతులైనా ఇలా మాట్లాడతారా?” అని అచ్చెన్న మండిపడ్డారు.