19న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర

* పర్చూరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 19వ తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నారు. సాగు నష్టాలతో, అప్పుల భారంతో కుంగిపోయి సుమారు 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, ఆ కుటుంబాలను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. సోమవారం సాయంత్రం ప్రకాశం జిల్లా పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న పక్షంలో రూ.7 లక్షలు ఆర్థిక సాయం అందించాలి. ఈ సాయం అందించటం లేదు. కౌలు రైతులకు అండగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ గారు భరోసా యాత్ర చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. 19వ తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ యాత్ర ఉంటుంది. పర్చూరు నియోజకవర్గం పరిధిలో బహిరంగ సభ నిర్వహించనున్నాం” అన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. విజయ్ కుమార్, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.