జో బైడెన్ రెస్క్యూ ప్లాన్.. వంద రోజుల్లో వంద మిలియన్ల టీకాలు

మరో ఐదు రోజుల్లో అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న జో బైడెన్ అమెరికన్ రెస్క్యూ పేరిట కీలక ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వంద రోజుల్లో వంద మిలియన్ల మందికి కరోనా టీకాలను  వేయాలని నిర్ణయించారు. అలాగే, వైరస్ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం 1.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్రణాళికను ప్రకటించారు. స్థానిక ప్రభుత్వాలకు ఈ నిధులను అందించాలని నిర్ణయించారు.

అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు స్వీకరించే రోజునే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టిన అభిశంసన తీర్మానంపై సెనేట్‌లో చర్చ జరగనుంది. కేపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి తదనంతర పరిణామాలతో ట్రంప్‌పై ఇటీవల ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం 232 ఓట్లతో నెగ్గింది. ట్రంప్ పార్టీకి చెందిన నేతల్లో పదిమంది ఈ తీర్మానానికి మద్దతు పలకడం గమనార్హం. అభిశంసన తీర్మానం సెనేట్‌లో కూడా నెగ్గితే ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారు. ఇందుకోసం డెమోక్రాట్లకు 17 ఓట్లు అవసరం.